వెల్లువెత్తిన హర్షాతీరేకం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 7 : గిరిజనుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు కొమరం భీం  కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పింది. విగ్రహం ఏర్పాటుపై జిల్లా గిరిజనులతోపాటు ఉద్యమకారులు మేదావులు, భీం వారసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల ఆరాద్య దైవం, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత 10 సంవత్సరాలుగా  పోరాటం చేస్తున్నారు. గిరిజనుల పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో దిగి వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ఆయన కాంచ విగ్రహాన్ని హుసేన్‌సాగర్‌ ఒడ్డుపై నెలకొల్పింది.భీం 72వ వర్థంతిని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన అధికార లాంచనలతో, గిరిజనుల సాంప్రదాయబద్దంగా ఆవిష్కరించనున్నట్టు గిరిజన నాయకులు వెల్లడించారు. గిరిజనుల హక్కుల కోసం నిజాం నవాబ్‌తో సాయుద పోరాటం నిర్వహించి నీరు, అడవీ, భూమి కోసం పోరాడి 1940లో అసువులు బాశారు. అప్పటి నుండి ఆయనను గిరిజనులు దేవుడిగా పోలుస్తూ వస్తున్నారు. స్వాతంత్య్ర తర్వాత ఆయన స్వగ్రామమైన  చోడే ఘాట్‌లో అధికారికంగా దర్బార్‌ ఏర్పాటు చేసి గిరిజన సమస్యలకు పరిష్కరించే సాంప్రదాయం కనసాగిస్తున్నారు. ఆయన విగ్రహం ఏర్పాటుతో ఆయనకు నివాళ్లు అర్పించినప్పటికీ కొమరంభీంకు  ప్రభుత్వం భారతరత్న అవార్డును ఇచ్చి ఆయన ఆశయాలైన నీరు, భూమి, అడవిపై గిరిజనులకు సంపూర్ణంగా హక్కులు కల్పించననాడే గిరిజనులకు న్యాయం జరగడంతోపాటు, కొమరంభీంకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.