అంబేద్కర్‌, మోదీ బ్రాహ్మణులే..!

– వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది

న్యూఢిల్లీ, జ‌నం సాక్షి ) : బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది కూడా ఈ లిస్ట్‌లో చేరారు. వాళ్లకున్న విజ్ఞానం తెలివితేటల పరంగా చూస్తే అంబేద్కర్‌, మోదీలు బ్రాహ్మణులే అని త్రివేది అన్నారు. అయితే ఆయన కామెంట్స్‌ను తమ పార్టీకి చెందిన ఎంపీ ఉదిత్‌రాజ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి త్రివేది భగవద్గీతను ఉదహరించారు. కులం అనేది ఓ వ్యక్తి చేసే పని నుంచి వస్తుంది తప్ప జన్మ నుంచి కాదు. తాను జీవితంలో చేసే పని వల్ల ఓ వ్యక్తి బ్రాహ్మణుడవుతాడు. గీత పరంగా చూస్తే జ్ఞానం ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు అని త్రివేది అన్నారు. ఈ మధ్యే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మోదీ, అంబేద్కర్‌ బ్రాహ్మణులు, కృష్ణుడు ఓబీసీ అని అనడం తీవ్ర దుమారం రేపింది. బ్రాహ్మణులే దేవుళ్లను తయారుచేశారు. రాముడు క్షత్రియుడు. కానీ ఆయనను రుషులే దేవుడిని చేశారు. ఇప్పుడు మనం కృష్ణుడిని ఓబీసీ అంటున్నాం. కానీ ఆ ఓబీసీని దేవుడిని చేసింది బ్రాహ్మణుడైన సందిపాణి రుషి అని త్రివేది అన్నారు. పాలను మరిగించినపుడు పైన ఏర్పడే విూగడే బ్రాహ్మణులు అని ఆయన చెప్పారు. ఎవరైనా బాగా విజ్ఞానం సంపాదించినవాళ్లు బ్రాహ్మణులు అని త్రివేది స్పష్టంచేశారు. అందుకే అంబేద్కర్‌ ఓ బ్రాహ్మణుడని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను. ఆయన ఇంటిపేరు ఓ బ్రాహ్మిన్‌దే. ఆ పేరును ఓ బ్రాహ్మణుడైన ఆయన ఉపాధ్యాయుడే పెట్టారు. అందుకే బాగా విజ్ఞానం సంపాదించిన వ్యక్తిని బ్రాహ్మణుడని పిలవడంలో తప్పులేదు. మోదీ కూడా ఓ బ్రాహ్మణుడని చెప్పడానికి గర్వపడుతున్నాను అని త్రివేది అన్నారు.