అక్రమంగా బోర్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు, ఎస్పీకి ఫిర్యాదు..

ఊరుకొండ, సెప్టెంబర్ 28 (జనంసాక్షి):
ఊరుకొండ మండల కేంద్రంలోని రాచాలపల్లి గేట్ సమీపంలో గల సర్వేనెంబర్ 221/E/1/1/1 లో తనకు సంబంధించిన 2-30 ఎకరాల భూమిలో ఊరుకొండ పిఎసిఎస్ సిబ్బంది, అధికారులు అక్రమంగా ప్రవేశించి జెసిబి తో చెట్లు తొలగించి బోరు డ్రిల్లింగ్ చేయడం పై బుధవారం జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాథిత మహిళా రైతు మేకల శాంతమ్మ పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులలో తనకు సర్వ హక్కులు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా ఈనెల 27న బోర్ డ్రిల్లింగ్ చేయడం పై ఊరుకొండ తహసిల్దార్ కు, స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేసినప్పటికి ఇలాంటి చర్యలు తీసుకోలేదని జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదులో విన్నవించారు. రెవిన్యూ రికార్డులలో పిఎసిఎస్ సిబ్బందికి ఎలాంటి హక్కులు లేవని, పిఎసిఎస్ కు తాసిల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్ కాలేదని వాపోయారు. సర్వహక్కులు ఉన్న తన పొలంలో అక్రమంగా ప్రవేశించి బోరు వేసిన పిఎసిఎస్ సిబ్బంది పై తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని మహిళా రైతు మేకల శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.