అమరావతి అభివృద్ధికి.. ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉంది

– ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రెండుసార్లు పర్యటించారు
– ఇక్కడి అవినీతిపై రైతులు, ఎన్జీవోలు వారికి ఫిర్యాదు చేశారు
– ప్రపంచ బ్యాంకు జోక్యంపై కేంద్రం అభ్యంతరం
– నవరత్నాలకు ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు
– అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
అమరావతి, జులై22(జ‌నంసాక్షి) :  అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉందని, రూ. 5వేల కోట్లు సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ఆయన మాట్లాడారు.. ప్రపంచ బ్యాంకు నిధులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉందని, రూ. 5వేల కోట్లు సాయమందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారని, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన
నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారని వివరించారు. అయితే తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకానికి ఆర్థిక సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. అమరావతి స్థిరమైన మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు మద్దతు ఉంటుందని, అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నుంచి సహాయం కోరుతూ ఏపీ ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 8న ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపిందన్నారు. అయితే ప్రాజెక్టు ప్రతిపాదన కోసం చేసిన అభ్యర్థన 25మే 2017న పునరుద్ధరించబడిన తరువాత జూన్‌లో నమోదు చేయబడిందని, ప్రపంచ బ్యాంకు, ఆసియా మోలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు నుంచి నిధుల కోసం రుణ ప్రతిపాదనను డీఆఏ క్లియర్‌ చేసిందన్నారు. అయితే నూతన రాజధాని నగర అభివృద్ధి నమూనా వల్ల కలిగే ప్రతికూల, పర్యావరణ సామాజిక, ఆర్థిక ప్రభావావలకు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిదని అన్ని విధాలుగా స్పష్టంగా తెలుస్తోందన్నారు. గత ప్రభుత్వ చర్యలు భారతదేశాన్ని ఇరకాటంలోకి నెట్టాయని, ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుకు ఆమోదించక పూర్వమే, స్వతంత్ర బృందం దర్యాప్తు చేయాలని సిఫారసు చేసిందన్నారు. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారు, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఇక్కడి దోపిడి చూసి ప్రపంచ బ్యాంకు బయపడిందని, ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని బుగ్గన అన్నారు. ప్రపంచ బ్యాంకు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారని అన్నారు.  అయితే తాజాగా అమరావతి మానవ అభివృద్ధి ప్రాజెక్టుకు పూర్తి సహాకారం అందిస్తామని వివరించిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
అమరావతిని అధోగతిపాలు చేశారు – ప్రతిపక్షనేత చంద్రబాబు
అమరావతి టెండర్ల పక్రియ పారదర్శకంగా జరిగిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు. వరల్డ్‌బ్యాంక్‌కు వైసీపీ తప్పుడు ఫిర్యాదుల వల్లే రుణం నిలిచిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్‌పై ప్రేమతోనే అమరావతిని అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తను తీసుకొచ్చిన రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు నిర్మాణాలను వైఎస్‌ కొనసాగించారు.. కానీ సీఎం జగన్‌ అమరావతి నిర్మాణాన్ని పక్కనబెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని రైతుల ఉసురు జగన్‌కు తగులుతుందని విమర్శించారు.