అమరావతి నిర్మాణ పనుల్లో అపశృతి
ముగ్గురు బీహార్ కార్మికుల మృతి
అమరావతి,జూలై23(జనంసాక్షి): ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస భవనాల వద్ద సోమవారం సాయంత్రం జరిగిన లిఫ్టు ప్రమాదంలో ఎన్సీసీ కంపెనీకి చెందిన ముగ్గురు సాంకేతిక సిబ్బంది మృతి చెందారు. భవనానికి సంబంధించి ఐదో అంతస్తులో పనిచేస్తుండగా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొన్న లిఫ్టు గొలుసు హఠాత్తుగా తెగిపోయింది. దీంతో అందులో కూర్చొని పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందారు. మృతులను బిహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్, కృపాల్ కుమార్, సురేంద్ర కుమార్గా గుర్తించారు. వీరందరూ సంవత్సరం క్రితం విధుల్లో చేరారు.