అయోధ్య వివాదంపై..  అత్యవసర విచారణ అవసరంలేదు


– జనవరికి వాయిదావేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై విచారణకు జనవరి మొదటివారంలో తేదీలను వెల్లడిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎప్పుడైనా రోజువారీ విచారణ ప్రారంభం కావచ్చని, ధర్మాసనం ఏర్పాటు, రోజువారీ విచారణ షెడ్యూల్‌పై జనవరిలో నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ వెల్లడించారు. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ కె.ఎం జోసెఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కీలకమైన ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏదో ఒకటి తేల్చుతుందని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ కేసును జనవరికి వాయిదా వేయడంతో రెండు నెలలు వేచిచూడక తప్పదని సరి అయింది. అయోధ్యలోని వివాదస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి సున్నీ వక్ఫ్‌బోర్డు, రామ్‌ లల్లా, నిర్మోహి అఖారాలకు చేరో భాగం పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ మొత్తం 13పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, ఈకేసును విస్తృత ధర్మసనానికి అప్పగించడానికి ఈ ఏడాది సెప్టెంబరులో నిరాకరించింది. తదుపరి విచారణ అక్టోబరు 29కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ధర్మాసనం ప్రకటించింది. అంతేకాదు, మసీదు ఇస్లాంలో అంతర్గతం కాదని, ముస్లింలు బహిరంగ ప్రదేశాలతోపాటు ఎక్కడైనా నమాజ్‌ చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది.