అయోధ్య సమస్యను పరిష్కరిస్తాం
– గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ
అహ్మదాబాద్,డిసెంబర్ 6,(జనంసాక్షి): కాంగ్రెస్పై ప్రధాని నరేంద్రమోదీ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. గుజరాత్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న మోడీ.. బుధవారం ఆయన ధంధూకా, ద¬ద్ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. జాతీయ నేతలు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, అంబేడ్కర్లకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ‘భారతరత్న’ అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులకు ఓ కుటుంబం తీవ్ర అన్యాయం చేసిందని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూకి పూర్తిస్థాయి ప్రభావం ఉన్నప్పటికీ… రాజ్యాంగ పరిషత్తులో చోటు దక్కించు కునేందుకు డాక్టర్ అంబేద్కర్ చాలా కష్టపడాల్సివచ్చిందని ధ్వజమెత్తారు. అయోధ్య అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలతో ముడిపెడుతోందని ప్రధాని మండిపడ్డారు. 2019 వరకు అయోధ్య-బాబ్రిమసీదు వివాదాన్ని వాయిదా వేయాలన్న కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దేశంగురించి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బాధ లేదని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నదని విమర్శించారు. 2019వరకు అయోధ్య సమస్యకు పరిష్కారం కాకుండా ఎవరు
ఆపలేరని అన్నారు. అయోధ్య సమస్యకు పరిష్కారం దొరకడం కాంగ్రెస్ ఇష్టం లేదన్నారు. ‘ట్రిపుల్ తలాఖ్పై మౌనం వహించకుండా నేను స్పష్టమైన వైఖరిని వెల్లడించానన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూదని, ఇది మహిళల హక్కుల సంబంధించిన విషయమన్నారు. మానవత్వమే ముఖ్యం.. ఆ తర్వాతే ఎన్నికలు’ అని అన్నారు. దేశంలో సామాస్య ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రధాని తెలిపారు. రాబోయే కాలంలో పేదవర్గాల్లోని ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
కపిల్ వాదనలతో కాంగ్రెస్కు సంబంధం లేదు – ఆనంద్శర్మ
అయితే మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆనంద్శర్మ స్పందించారు. కపిల్ వాదనలతో పార్టీకి ఏ సంబంధం లేదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ స్పష్టంచేశారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ భోపాల్ గ్యాస్ విషాదం కేసులో డౌ కెమికల్ కంపెనీ తరఫున నిలిచారు. ఇలా ఎందుకు చేశావని మోదీ ఆయనను అడిగారా? బీజేపీలో చాలా మంది పెద్ద లాయర్లు ఉన్నారు. వాళ్లంతా క్రిమినల్స్కు అండగా నిలిచారు. వాళ్లందరినీ మోదీ నిలదీస్తున్నారా? సిబల్ కోర్టులో చెప్పినదాంతో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదు. అయోధ్యపై సుప్రీంకోర్టే పరిష్కారం చూపాలన్నది కాంగ్రెస్ వాదన అని ఆనంద్ శర్మ స్పష్టంచేశారు.