అరంగేట్రం చేయబోతున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో హైదరబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(ఎఫ్‌సీ) నూతన జట్టుగా అరంగేట్రం చేయబోతోంది. వచ్చే అక్టోబర్‌ 20న ఆరంభమయ్యే లీగ్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆర్థికపరమైన కారణాలతో ఫుణె సిటీ జట్టు లీగ్‌ నుంచి వైదొలగడంతో ఆ స్థానంలో హైదరాబాద్‌ రాబోతోంది. ఈ జట్టుకు ఐటీ ఎంటప్రెన్యూర్‌ విజయ్‌ మద్దూరి, కేరళ బ్యాస్టర్స్‌ ఎఫ్‌సీ మాజీ సీఈవో వరుణ్‌ త్రిపురనేనిలు యాజమానులగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్‌ ఎఫ్‌సీ ¬ం గ్రౌండ్‌గా గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆతిథ్య మ్యాచ్‌లు కూడా ఈ స్టేడియంలోనే జరుగుతాయి. ఫుట్‌బాల్‌తో హైదరాబాద్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, నగరానికి గర్వకారణంగా నిలిచేలా జట్టును తీర్చిదిద్దుతామని వరుణ్‌ తెలిపారు. వచ్చే సీజన్‌ను గొప్పగా ఆరంభించేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధమవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 2019-2020 సీజన్‌లో భాగంగా అక్టోబర్‌ 20న కోచిలో తొలి మ్యాచ్‌ జరగనుంది.