అరుణ్ జైట్లీ కొత్త ఆఫర్స్..!!
పెద్ద నోట్లు రద్దయి ఒక నెల పూర్తయిన సందర్భంగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా, ప్రజలను ఆకట్టుకునేలా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు తన వరాలు మూటను విప్పారు. ఒకటి… రెండు..మూడు అంటూ మొత్తంగా పదకొండు వరాలను ప్రకటించారు. ఇందులో ప్రతీ ఒక్కటీ ప్రజలకు భారీస్థాయిలో మేలు చేసేదే కావడం విశేషం.
1. డిజిటల్ రూపంలో (డెబిట్ / క్రెడిట్ కార్డు, ఇ-వాలెట్స్, మొబైల్ వాలెట్స్ తదితరాలు) పెట్రోలు, డీజిల్ కొనుగోలు పై కొనుగోలుదారులకు విక్రయ ధరపై 0.75 శాతం తగ్గింపు
2. పదివేల కన్నా తక్కువ జనాభా ఉండే ఒక లక్ష గ్రామాల్లో ప్రతీ గ్రామానికి రెండు పీఓఎస్ల ఏర్పాటు. ఈ పీఓఎస్ మెషిన్లను ప్రాథమిక సహకార సంఘాలు, పాల సహకార సంఘాలు, విత్తనాలు, ఎరువుల డీలర్ల వద్ద అమరుస్తారు. మొత్తం మీద 75 కోట్ల మంది గ్రామీణలు తమ వ్యవసాయ అవసరాలకు నగదురహిత చెల్లింపులు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
3. దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగిన వారికి గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు, సహకార సంఘాలు రూపే కిసాన్ కార్డులు ఇచ్చేందుకు నాబార్డ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరించనుంది. దీంతో వారంతా కూడా పీఓఎస్ మెషిన్లు / మైక్రో ఏటీఎం / ఏటీఎంల వద్ద నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు వీలవుతుంది.
4. రైల్వే తన సబర్బన్ రైల్వే నెట్వర్క్ ద్వారా ప్రోత్సాహకాలను అందించనుంది. జనవరి 1 నుంచి నెలవారీ, సీజనల్ టికెట్లను కొనే వారు డిజిటల్ రూపంలో చెల్లిస్తే వారు 0.5 శాతం డిస్కౌంట్ పొందుతారు.
5. అన్లైన్ లో టికెట్లు కొనే రైలు ప్రయాణికులందరికీ రూ. 10 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించనున్నారు. రోజూ సుమారుగా 14 లక్షల మంది రైలు టికెట్లు కొంటున్నారు. ఇందులో 58 శాతం టికెట్లు ఆన్లైన్లో డిజిటల్ చెల్లింపులతో విక్రయమవుతున్నాయి. మరో 20 శాతం మంది డిజిటల్ చెల్లింపులోకి మారగలరని అంచనా. దీంతో రోజుకు సగటున 11 లక్షల మంది ఈ బీమా పరిధిలోకి వస్తారు.
6. రైల్వే అందించే కేటరింగ్, వసతి, విశ్రాంతి గదులు లాంటి పెయిడ్ సేవలకు డిజిటల్ రూపంలో చెల్లింపులపై 5 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
7. ప్రభుత్వరంగ బీమా సంస్థలు సాధారణ బీమా పాలసీలకు డిజిటల్ చెల్లింపులపై 10 శాతం రాయితీని అందించనున్నాయి. అదే విధంగా ఎల్ఐసీ నూతన జీవిత బీమా పాలసీలపై 8 శాతం రాయితీని అందించనుంది. వీటిని పొందేందుకు సంబంధిత పోర్టల్స్ ద్వారా చెల్లింపులు చేయాలి.
8. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెల్లింపులు డిజిటల్ రూపంలో చేస్తే లావాదేవీల ఫీజు / ఎండీఆర్ ఛార్జీల భారాన్ని వినియోగ దారులపై మోపరు. ఆ భారాన్ని ఆయా సంస్థలే భరిస్తాయి. ఇదే విధానాన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
9. పీఒఎస్ టర్మినల్స్, మైక్రో ఏటీఎం, మొబైల్ పీఓఎస్లకు నెలవారీ అద్దెను రూ100 లోపుగా తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది. దీంతో చిన్న తరహా వ్యాపారులు మరెందరో వీటిని పొందేందుకు వీలు కలుగుతుంది.
10. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేదా ఎండీఆర్లకు సంబంధించి ఒక్కో లావాదేవీకి రూ.2,000 వరకు డిజిటల్ చెల్లింపులపై సర్వీస్ టాక్స్ రద్దు
11. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఆర్ఎఫ్ఐడీ కార్డ్ లేదా ఫాస్ట్ టాగ్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే 2016-17 వరకు 10 శాతం తగ్గింపు.