అర్థం లేకుండా కోహ్లీ ఆట

చెన్నైపై ఓడితే కెప్టెన్సీ నుంచి తీసేయనున్న ఆర్‌సీబీ!
అబుధాబి,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో సంచలనం నమోదవుతుందా? మరో జట్టు కెప్టెన్‌ను మధ్యలోనే తీసేస్తారా? ఇప్పటికే ఆ సారథిపై ఫ్రాంచైజీ గుర్రుగా ఉందా? మరొక్క మ్యాచులో సరిగ్గా ఆడకపోతే అంతే సంగతులా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శుక్రవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో గనక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రాణించకపోతే అతడిని మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌ ముగిశాక నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించినా సరే.. ఆడకపోతే మాత్రం చెన్నై పోరు తర్వాత తొలగిస్తారని కొందరు అంటున్నారు. ఐపీఎల్‌ రెండో అంచెలో ఆడిన తొలి మ్యాచులో బెంగళూరు ఘోర పరాజయం పాలైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో కేవలం 92 పరుగులకే ఆలౌటైంది. విరాట్‌ కోహ్లీ సైతం ఏ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. వచ్చీ రాగానే వికెట్‌ ఇచ్చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల యాజమాన్యం సీరియస్‌ అయిందని తెలిసింది. అందుకే చెన్నై మ్యాచులో కచ్చితంగా గెలవాలని షరతులు విధించారని సమాచారం. ఆ మ్యాచులో ఓడిపోతే ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయని ఫ్రాంచైజీ భావిస్తోంది. ‘కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కోహ్లీ ఎలా ఆడాడో ఒకసారి చూడండి. అర్థం లేకుండా ఆడాడు! చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. సీజన్‌ మధ్యలోనే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించినా ఆశ్యర్యం లేదు. కోల్‌కతాలో దినేశ్‌ కార్తీక్‌, హైదారబాద్‌లో డేవిడ్‌ వార్నర్‌కు ఇలాగే అయింది. వారే దిగిపోవడమో, మధ్యలోనే తొలగించడమో జరిగింది. ఆర్‌సీబీలోనూ ఇలాగే జరగొచ్చు. కోల్‌కతాతో మ్యాచ్‌ చూశాకా నాకైతే ఇలాగే అనిపించింది. మరోక్క మ్యాచులో సరిగ్గా ఆడకపోతే కెప్టెన్సీలో మార్పు కచ్చితంగా జరగొచ్చు’ అని ఓ మాజీ క్రికెటర్‌ అంటున్నాడు.