అవినీతి కేసీఆర్‌ను సాగనంపండి

` ఇక ఆయన సమయం అయిపోయింది
` పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిందేవిూ లేదు
` వేలకోట్లను లూటీ చేసిన కెసిఆర్‌ కుటుంబం
` ఆర్మూర్‌ సభలో అమిత్‌ షా
నిజామాబాద్‌,హైదరాబాద్‌(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన టేబుల్‌పైన ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్లను మంత్రి వర్గంలోకి చేర్చుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ఇక కేసీఆర్‌ టైం అయిపోయిందని.. ఆ అవినీతి కేసీఆర్‌ను అధికారం నుంచి దింపాల్సిన సమయం వచ్చిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అవినీతిపరులు అందరినీ జైలుకు పంపే కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని అన్నారు. కేసీఆర్‌ అవినీతిపై విచారణ చేయించి ఆయన్ని జైలుకు పంపడం ఖాయమని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభ బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించారు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్‌ ఏ పనీ చేయలేదని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చేతిలో ఉందని విమర్శించారు. ఓవైసీకి, రజాకార్లకు భయపడి కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినం జరపడం లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ కోసం వారు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఆయన ఇచ్చిన ఏ హావిూని కేసీఆర్‌ సర్కార్‌ నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్‌ పదేళ్లుగా తెలంగాణను నాశనం చేయడమే కాకుండా.. తెలంగాణలో ఆర్టీసీ స్థలాలను ప్రభుత్వం కబ్జా చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం పెట్టిన పరీక్షలను పేపర్‌ లీకేజ్‌ల పేరుతో అన్యాయం చేశారని విమర్శించారు. 2014లో దళితుడ్ని సీఎంను చేస్తానని హావిూ ఇచ్చి.. కేసీఆర్‌ దాన్ని మాట తప్పారని విమర్శించారు. కానీ, బీజేపీ బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తుందని హావిూ ఇస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌ లో పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎక్కువగా ఉన్న బీడీ కార్మికుల కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక హాస్పిటల్‌ ను కూడా కట్టిస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ ప్రభుత్వం విధిస్తున్న సెస్‌, వ్యాట్‌ లాంటి పన్నులను తొలగించి ధరలను తగ్గిస్తామని చెప్పారు.
ఉగ్రవాదులకు అడ్డగా రాజేంద్రనగర్‌
హైదరాబాద్‌:తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం పలు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. నగరంలో భారీ రోడ్డు షో నిర్వహించారు. రాజేంద్రనగర్‌  రోడ్‌ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్‌ షోలో అమిత్‌ షా మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఏడాది కాలంలో రాజేంద్రనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ఎంఐఎం సాయంతోనే ఉగ్రవాదులు తల దాచుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదులను కూకటి వేళ్లతో తొలగిస్తాం. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వేర్వేరు కాదు. ఎస్సీ వర్గీకరణ 2024 తప్పకుండా చేస్తాం అని అమిత్‌ షా స్పష్టం చేశారు.