న్యూదిల్లీ: పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి అశోక్గజపతి రాజుతో శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. వీరికి కేంద్రమంత్రి అనంత్గీతె కూడా మద్దతుగా వెళ్లడం గమనార్హం. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్పై విమానయాన సంస్థల నిషేధం అంశంపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత రవీంద్రగైక్వాడ్ మాట్లాడిన అనంతరం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు మాట్లాడుతుండగా గందరగోళం చెలరేగింది. దీంతో సభను వాయిదావేశారు.సభవాయిదా పడిన వెంటనే శివసేన ఎంపీలు ఆయన్ను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తించారు. వీరిలో కేంద్ర మంత్రి, శివసేన ఎంపీ అనంత్గీతె కూడా ఉన్నారు. ఈసందర్భంగా గీతె మాట్లాడుతూ ‘ముంబయి నుంచి విమానాలు ఎలా వెళతాయో మేము చూస్తాం’ అంటూ బెదిరించారు. వెంటనే స్పందించిన సహచర మంత్రులు స్మృతి ఇరానీ, అహ్లూవాలియాలు గీతెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. తెదేపా ఎంపీలు కూడా అశోక్గజపతిరాజుకు మద్దతుగా అక్కడకు వెళ్లారు. వివాదం ముదరుతోందని గమనించిన కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ వెంటనే అశోక్గజపతిరాజు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం స్పీకర్ సుమిత్రామహాజన్ అశోకగజపతిరాజు, రాజ్నాథ్సింగ్తో సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.