అశ్రు నయనాలతో నాగరాజు అంత్యక్రియలు

2

అపస్మారక స్థితిలోనే ఎస్‌ఐ సిద్ధయ్య

హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌5(జనంసాక్షి): నల్లగొండ జిల్లాలోని జానకీపురంలో సిమి ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన కానిస్టేబుల్‌ నాగరాజు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. నాగరాజు స్వగ్రామం రసూల్‌ గూడెంలో భౌతికకాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు. నాగరాజు పార్థీవదేహానికి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ నివాళులర్పించారు. వేలాదిగా గ్రామస్థులు, అభిమానులు తరలిరాగా అమరుడు నాగరాజుకు జోహార్‌ అంటూ నినాదాలు మిన్నంటాయి.

మరోవైపు దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నల్లగొండ జిల్లా ఆత్మకూర్‌(ఎం)ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య (29)ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆదివారం ఉదయం వైద్యులు విడుదల చేసిన మెడికల్‌ బులెటన్‌లో స్పష్టం చేశారు. బ్లడ్‌ప్లజర్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చి, అధిక రక్తస్త్రావాన్ని నివారించినప్పటికీ..ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇప్పటి వరకు ఆయన కళ్లు తెరచి కూడా చూడలే దు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న మెదడు, పొత్తికడుపులో ఉండిపోయిన బుల్లెట్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలా? లేదా అనే అంశంపై వైద్యులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.

నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకిపురం-చిన్నకోడూరు మధ్య శనివారం ఉదయం పోలీసులకు, దుండగులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డిలను చికిత్స కోసం ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. వీరిలో సీఐ బాలగంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, ఎస్‌ఐ సిద్ధయ్య మాత్రం ఇంకా మృత్యువుతోనే పోరాడుతున్నాడు. పది మందితో కూడిన వైద్య బృందం ఇప్పటి వరకు ఆయనకు మూడు శస్త్రచికిత్సలు చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్‌ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్‌ను తొలగించారు. అలాగే, పొత్తి కడుపును పూర్తిగా ఓపెన్‌ చేసి ఇన్‌ఫెక్షన్‌ సోకిన భాగాలను శుభ్రం చేసినప్పటికీ…కడుపులోని బుల్లెట్‌ వ ల్ల ప్రా ణానికి ప్రమాదం లేక పోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. శరీరం శస్త్రచికిత్సకు సహకరించక పోవడంతో చిన్న మెదడులోకి దూసుకపోయిన మరో బుల్లెట్‌ను కూడా వదిలేశారు. బాధితుని ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడిన తర్వాత మరోసారి శస్త్రచికిత్స చేసి వాటి ని తొలగించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే రెండు రోజులైనా సిద్ధయ్య కళ్ల్లు తెరిచి చూడక పోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.