అశ్వరావూపేటలో రెండవ పామాయిల్‌ పరిశ్రమ

ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం జిల్లా అశ్వరావూ పేట మండలంలో రెండవ పామాయిల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించింది. గంటకు 20 నుంచి 40టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు రూ. 38.75కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్‌ 06, 2013 ప్రకారం ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతులు మంజూరు చేసింది. అశ్వరావూపేటనుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో రాష్ట్రీ రహదారిపై గల నారంవారి గూడెం వద్ద కేంద్రీయ నర్సరీ స్థలంలో రెండో పామాయిల్‌ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ నూనె గింజల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలోని అశ్వరావుపేటలో ఒకటి ఉండగా, రెండోవది పశ్చిమగోదావరి జిల్లా పెద్దవీధిలో ఉంది. తాజాగామూడో పరిశ్రమ అశ్వరావుపేట మండలం నారంవారి గూడెం వద్ద ఏర్పాటు కానుంది. తెలంగాణ మొత్తంలో రెండవ పామాయిల్‌ ఫ్యాక్టరీ ఇదే కానుంది. పూర్తిగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోయే అశ్వరావు పేటలోని రెండోవ పామాయిల్‌ పరిశ్రమను సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ నూనె గింజల సమాఖ్య కానీ, ప్రైవేటు పరిశ్రమలు గానీ చేయని రీతిలో ఈ పరిశ్రమ విద్యుత్‌, గ్యాస్‌ తయారుచేయాలని ఆ విధంగానే నమునాలు రూపొందించారు. ఆయిల్‌ ఫాం గెలల ద్వారా విద్యుత్‌, బయోగ్యాస్‌ తయారు చేసుకునేందుకు నమూనాలు రూపొందించారు.