అసద్‌కారుపై కాల్పులు


` తృటిలో తప్పిన ప్రాణాపాయం
` స్వతంత్య్ర దర్యాప్తు చేయాలి:ఒవైసీ
` ఓ షూటర్‌ని అరెస్టు చేసిన యూపీ పోలీసులు
` క్షేమంగా బయటపడటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్‌
దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి):ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన వాహనంపై మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్‌ వెల్లడిరచారు. సురక్షితంగా బయటపడిన ఆయన కాల్పుల ఘటన విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపారు. మేరఠ్‌ జిల్లా కితౌర్‌లో ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్‌ పాల్గొన్నారు. ప్రచారం అనంతరం దిల్లీకి వెళ్తుండగా ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్‌ పేర్కొన్నారు. టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు 3`4 రౌండ్లు కాల్పులు జరిపారన్నారు. షూటర్లు ఆయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారని పేర్కొన్నారు. కాల్పుల్లో తన కారు టైర్లు పంక్చర్‌ కావడంతో మరో వాహనంలో దిల్లీకి వెళ్లినట్టు అసదుద్దీన్‌ తెలిపారు. తామంతా సురక్షితంగా బయటపడినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు.
స్వతంత్ర దర్యాప్తు జరపాలి: ఒవైసీ
దిల్లీ చేరుకున్న అనంతరం అసదుద్దీన్‌ విూడియాతో మాట్లాడారు. తన కారుపై కాల్పుల ఘటనలో ఓ షూటర్‌ని అరెస్టు చేసి.. ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తనకు సమాచారం ఇచ్చారని అసదుద్దీన్‌ వెల్లడిరచారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్టు చెప్పారు. స్వతంత్ర దర్యాప్తు జరపడం ఉత్తర్‌ ప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవనున్నట్టు తెలిపారు.
ఒకరి అరెస్టు.. మరొకరి కోసం గాలిస్తున్నాం: హాపూర్‌ ఎస్పీ
అసదుద్దీన్‌ కారుపై కాల్పుల ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు హాపూర్‌ ఎస్పీ దీపక్‌ భుకేర్‌ వెల్లడిరచారు. అతడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడనీ.. ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌లు ఏమైనా ఉంటే విూడియాకు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
మూడు`నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి:అసదుద్దీన్‌
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీ వెళ్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, తన కారుపై కాల్పుల సమయంలో అక్కడేం జరిగిందో అసదుద్దీన్‌ ఒవైసీ దిల్లీలో విలేకర్లకు వివరించారు. ‘‘ఇవాళ మేరఠ్‌ పర్యటనకు వెళ్లాం. అక్కడి నుంచి దిల్లీ తిరిగి వెళ్తుండగా టోల్‌ గేటు వద్ద కారు వేగం తగ్గగానే పెద్ద శబ్దం వినిపించింది. ఏంటని ఆలోచించే లోపే మరో శబ్దం వినిపించింది. మా కారులో ఉన్నవారు మనపై దాడి జరుగుతోందని చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మరోసారి శబ్దం వినిపించింది. నాకు తెలిసి మూడు`నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ తర్వాత దిల్లీ వెళ్తూ.. ఓ ఫ్లైఓవర్‌ వద్ద ఆగాం. వారు మమ్మల్ని వెంబడిస్తున్నారనిపించింది. మాపై దాడి జరుగుతున్నప్పుడు మా వెనకాల ఉన్న వాహనంలోని డ్రైవర్‌ షూటర్‌పైకి వాహనం పోనిచ్చాడు. ఎరుపు రంగు హుడీ వేసుకున్న వ్యక్తి కిందపడ్డాడు. మరో వ్యక్తి ఆ కారుపైనా కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఈసీని కోరుతున్నా. దీని వెనక ఎవరు ఉన్నారనే అంశంపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత యూపీ, కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి కూడా తీసుకెళ్తా’’ అని తెలిపారు.
సురక్షితంగా బయటపడినందుకు చాలా సంతోషం : కేటీఆర్‌
ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సురక్షితంగా బయటపడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘ అసద్‌ భాయ్‌.. ప్రమాదం నుంచి విూరు సురక్షితంగా బయటపడటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గం. ఈ పిరికి పంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా.’’ అంటూ ట్వీట్‌ చేశారు.