ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలను వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు మంత్రి సురేశ్‌ పరీక్షల వాయిదా విషయాన్ని వెల్లడించారు. జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేస్తూ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 9 నుంచి 28వ తేదీ వరకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల బదులు ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను నిర్వహించనున్నామని వివరించారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు అధికారులు పేర్కొన్నారు. మారిన పరీక్షల షెడ్యూల్‌ను విద్యార్థులు గమనించాలని కోరారు. మరోవైపు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు యథావిధిగా మార్చి 11 నుంచి మార్చి 31 వరకు జరుగుతాయని తెలిపారు.