ఆఖరి పోరాటం

– నితీష్‌కుమార్‌

పట్నా,నవంబరు 5 (జనంసాక్షి): ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని వ్యాఖ్యలు చేసి ఆశ్చర్యపర్చారు బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుండగా.. పూర్నియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన తన మద్దతుదారులకు మనసులో మాటను వెల్లడించారు. ‘ఎన్నికల ప్రచారానికి ఈ రోజు చివరి రోజు అని తెలుసుకోండి. ఎల్లుండి చివరి దశ ఓటింగ్‌ జరగనుంది. ఇవే నా చివరి ఎన్నికలు. అంతా సరిగ్గా ముగుస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే మూడుసార్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్‌.. నాలుగోసారి అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. భాజపాతో పొత్తు తనకు మరోసారి విజయాన్ని కట్టబెడుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు, మహాగట్‌ బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నితీశ్‌ హయాంలో అవినీతి జరిగిందని విమర్శలు గుప్పిస్తూ, తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తన ప్రచారపర్వాన్ని ఉద్ధృతం చేశారు. ఇదిలా ఉండగా, ఆ రాష్ట్రంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్‌ ముగియగా..నవంబర్‌ 7న చివరి విడత ఓటింగ్‌ జరగనుంది. నవంబర్‌ 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.