ఆగని సెల్ఫీ మరణాలు

zm06fux0

చెన్నై: దేశంలో సెల్ఫీ క్రేజ్ మోగిస్తున్న మృత్యు ఘంటికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తమిళనాడులో మితిమీరిన సెల్ఫీ క్రేజ్ ఓ  యువకుడిని బలితీసుకుంది. వేగంగా వస్తున్న రైలు పక్కన సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన దినా సుకుమార్ ప్రాణాలు కోల్పోయాడు.  చెన్నైలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఇంటర్మీడియట్ చదువుతున్న సుకుమార్ స్నేహితులతో కలిసి రైలుపట్టాలపై వస్తూ.. సెల్ఫీ తీసుకోవాలని ఆశపడ్డాడు. వేగంగా వస్తున్న రైలు బ్యాక్ డ్రాప్ లో  ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించాడు.  ఈ క్రమంలో అదుపుతప్పి రైలు కింద పడి దుర్మరణం పాలయ్యాడు.

కాగా  ప్రపంచంలో సంభవిస్తున్న సెల్ఫీ మరణాల్లో సగానికి పైగా ఇండియాలోనే జరుగుతున్నాయని ఇటీవల  ఓ సర్వే తేల్చింది.  ఇటీవల ముంబై అరేబియా సముద్రంలో సంభవించిన ఓ సెల్ఫీప్రమాదం నేపథ్యంలో నగరంలోని 16 ప్రాంతాల్లో సెల్ఫీలను నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలను యువత  పట్టించుకోకపోవడం విచారకరమని పలువురు వ్యాఖ్యానించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.