ఆటో- లారీ ఢీ: 13 మంది మృతి

కర్ణాటక: కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. చిత్రదుర్గ సమీపంలోని మందనాయకలహళ్లిలో ఓ ట్రక్కు అదుపుతప్పి 13 మంది ప్రాణాలను బలిగొంది. స్టీల్‌రాడ్‌ల లోడుతో వెళ్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న టాటా ఏస్‌ వాహనంపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కు భారీ లోడ్‌తో వెళ్తుండటంతో డ్రైవర్‌ కంట్రోల్‌ చేయలేకపోయాడని పోలీసులు తెలిపారు. స్టీల్‌రాడ్‌ల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను క్రేన్‌ సాయంతో వాటిని వెలికితీసినట్లు పేర్కొన్నారు. మృతులంతా కొడగవల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.