ఆర్థికంగా బలోపేతం దిశగా గిరిజనులు

జిసిసి బలోపేతంతో సత్ఫలితాలు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం మధ్య దళారులను తొలగించి వారు సేకరించే అటవీ ఫలసాయములను కొనుగోలు చేసి వారికి గిట్టుబాట ధరను చెల్లించాలనే సంకల్పానికి అనుగుణంగా కార్యాక్రమాలు సాగుతున్నాయి. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా జీసీసీని బలోపేతం చేస్తున్నారు. గిరజనలు అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంతోపాటు వారి అభివృద్ధి లక్ష్యంగా గతానికి భిన్నంగా కొత్త కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. అధికారుల కృషిఫలితంగా ప్రగతి దిశలో పయనిస్తోంది.ఐటీడీఏ అందిస్తున్న ప్రోత్సహం వల్ల సంస్థలోని అన్ని సొసైటీల ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగా గిరిజన సహకార సంస్థ కొత్త కొత్త ఆలోచనతో ముందకెళ్తొంది. నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాంరు. గిరిజనులకు నాణ్యమైన నిత్యావసర సరకులు, కాస్మోటిక్స్‌లు, వివిధ ఆహార పదార్థాలు ఎమ్మార్పీ ధర కంటే తక్కువకు అందించి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో గతేడాది అక్టోబరులో ఉట్నూరులో ఐటీడీఏ సహాకారంతో కొత్తగా ‘గిరిజన సూపర్‌ బజార్‌’ను ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలు ఇస్తోంది. ప్రతి నెల రూ.3 నుంచి 4 లక్షల వ్యాపారం ఈ గిరిజన సూపర్‌ బజార్‌ ద్వారా చేస్తూన్నారు. నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు సైతం ఈ సేవను వినియోగించుకుంటున్నారు. దీంతో జీసీసీ స్వల్ప లాభంతోపాటు గిరిజనులకు తక్కువ ధరకు మంచి సరుకులు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిర్యాని, కెరమెరి, నార్నూరు మండలాలలో ఇప్పటికీ 60 గ్రామాలకు చెందిన గిరిజనులు డీఆర్‌డిపోల నుంచి నిత్యావసర సరుకులను తీసుకెళ్లడానికి రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడం, ఎత్తైన ప్రదేశం ఉండడంతో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు జీసీసీ రూ. 8 లక్షలు ఖర్చుచేసి రెండు ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేసింది. వాటి ద్వారా ఈ మూడు మండలాలలోని మారుమూల గ్రామాల గిరిజనుల ఇంటింటికి నిత్యావసర సరుకులను సరఫరా చేస్తోంది. గిరిజనులు అడవుల నుంచి సేకరించే బంక, తేనే, ఇప్పపువ్వు, ఇప్పపరక, మైనం తదితర కలపేతర వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరను చెల్లించి కొనుగోలు చేయడంతోపాటు మారుమూల గిరిజన గ్రామాలు, తండాలలో నివసించే అడవిబిడ్డలకు అవసరమైయ్యే నిత్యావసర సరుకులను చౌకధరలకే డీఆర్‌డిపోల ద్వారా సరఫరా చేస్తోంది. వ్యవసాయ అవసరాల కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందజేస్తోంది. గిరిజనులు అడవుల నుంచి సేకరించే తేనెను శుద్ధి చేసే కర్మగారం లేదని గుర్తించిన అధికారులు నిర్మల్‌లో కొత్తగా తేనె శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రూ.15లక్షలతో ఆధునిక యంత్రాలను సమకూర్చి ఈ కర్మాగారం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రతి రోజు 500 కిలోలు స్వచ్ఛమైన తేనెను తీయనున్నారు. ఇలా చేయడంతో జిల్లా వాసులకు నాణ్యమైన తేనే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. అటవీ హక్కుల చట్టం కింద భూములు పొందిన గిరిజన రైతులు పత్తి, సోయా తదితర వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు. మొదటి సారి ఆ రైతులకు అవగాహన కల్పించి పంట మార్పిడికి చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీలో నివసిస్తున్న ఐటీడీఏ, పోలీసు, అటవీశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గిరిజన, సాంఘీక సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలకు అవసరమైయ్యే వంట గ్యాస్‌ బండలను ప్రైవేటులో కొనుగోలు చేయకుండా గిరిజన సహకార సంస్థ ఐటీడీఏ సౌజన్యంతో ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీని నిర్వహిస్తోంది.