ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్కు కరోనా
దేశంలో తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య
న్యూఢిల్లీ,అక్టోబర్26(జనంసాక్షి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ కోవిడ్-19 నిర్దారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. తనకు కరోనా సోకిన నేపథ్యంలో
తనతో సన్నిహితంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్ లోనే విధులు నిర్వర్తించనున్నానని చెప్పారు. నలుగురు డిప్యూటీ గవర్నర్లు బీపీ కనుంగో, ఎంకే జైన్, ఎండి పత్రా, ఎం రాజేశ్వర్ రావు నేతృత్వంలో బలంగా ఉన్న ఆర్బీఐ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని గవర్నర్ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ కాలంలో కార్యకలాపాలను సవిూక్షిస్తూ, ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలతో గవర్నర్ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. కాగా దేశంలో కరోనా విస్తరణ కాస్త తగ్గుముఖంపట్టినట్టు కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాటి గణాంకాల ప్రకారం 78 లక్షలకు పైగా కేసులు నమోదవగా, మరణాల సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 50 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా దానికి ఐదు వేలకుపైగా తక్కువ కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో 79 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 45,149 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 79,09,960కి చేరింది. ఇందులో 6,53,717 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న మరో 59,105 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తంగా 71,37,229 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. ఆదివారంఉదయం నుంచి సోమవారం వరకు కరోనాతో 480 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,19,014కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో నిన్నటివరకు 10,34,62,778 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. అక్టోబర్ 25న 9,39,309 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.