ఆర్‌బీఐ విషయంలో..  వెనక్కు తగ్గిన కేంద్రం


– ఆర్‌బీఐతో రాజీధోరణిలో వ్యవహరించాలని నిర్ణయం
– సంస్థ స్వతంత్రతను కేంద్రం గౌరవిస్తోంది
– ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంప్రదింపులు జరుపుతాం
– వివాదం నేపథ్యంలో ఆర్థికశాఖ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో.. కొన్ని విశేషాధికారాలను ఉపయోగించి ఆర్‌బీఐకి మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రం
భావిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ ఆ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌తో కొంత రాజీధోరణిలో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ స్వతంత్రతను ప్రభుత్వం గౌరవిస్తోందని, అయితే ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విస్తృత సంప్రదింపులు జరుగుతాయని ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ చట్టానికి లోబడి కేంద్ర బ్యాంకుకు స్వతంత్రత ఉండటం చాలా ముఖ్యమని, పాలన అవసరాల పరంగా కూడా ఇది ఆమోదయోగ్యమేనని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వాలు దీన్ని గౌరవిస్తూ వస్తున్నాయని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా, ప్రజా ప్రయోజనాల మార్గదర్శకత్వంలోనే ప్రభుత్వం, కేంద్రబ్యాంకు పనిచేస్తున్నాయని, అయితే ఇందుకోసం కేంద్రం, ఆర్‌బీఐ మధ్య పలు అంశాలపై ఎప్పటికప్పుడు విస్తృత సంప్రదింపులు జరుగుతాయని తెలిపింది. ఇతర నియంత్రణ సంస్థల మాదిరిగానే ఆర్‌బీఐతో చర్చలు జరుగుతాయని కేంద్రం తెలిపింది. ఆ సంప్రదింపుల వివరాలను కేందప్రభుత్వం ఎప్పుడూ బహిర్గతం చేయలేదని కేవలం తుది నిర్ణయాలను మాత్రమే ప్రకటిస్తామని తెలిపింది. ఈ సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సమస్యలను అంచనా వేసి, సాధ్యమైన పరిష్కారాలను సూచిస్తూ ఉంటుందని, ఇక విూదట కూడా కేంద్రం ఇలాగే చేస్తుంఅని ఆర్థికశాఖ ఆ ప్రకటనలో తెలిపింది.