‘ఇండియా’ రెండు భేటీలకు రూ.200 తగ్గింది’..

` ఎల్పీజీ ధరల తగ్గింపుపై మమత
కోల్‌కతా(జనంసాక్షి):గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇండియా కూటమి వల్లే కేంద్రం ఎల్పీజీ ధరలను తగ్గించందని పేర్కొంటూ ఎక్స్‌లో (ట్విటర్‌) పోస్ట్‌ చేశారు. ‘’గడిచిన 2 రెండు నెలల్లో ఇండియా కూటమి 2 భేటీలు మాత్రమే నిర్వహించింది. ఇంతలో ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.200 దిగి వచ్చింది’’ అని మమత ట్వీట్‌ చేశారు. ఇది ‘ఇండియా సత్తా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడిరచారు. ధరల తగ్గింపును ఇండియా కూటమి ఖాతాలో వేశారు.’’మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రక్షాబంధన్‌కు మా కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గ్యాస్‌ ధరల తగ్గింపుతో సోదరీమణులకు ఊరట లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పోస్ట్‌ చేశారు. మరోవైపు కేంద్ర కేబినెట్‌ చాలా గొప్ప నిర్ణయం తీసుకుందని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి. మహిళలకు ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతి అని భాజపా ఎంపీ తేజస్వి సూర్య ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నిర్ణయంతో 33 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి పేర్కొన్నారు.