ఇండోఫిసిఫిక్‌లో భారత్‌దే కీలక భూమిక

 

 

 

 

వైట్‌హౌజ్‌ ప్రతినిధి వెల్లడి

ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా పర్యటనకు రానున్న నేపథ్యంలో భారత్‌పై శ్వేతసౌధం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని వైట్‌హౌస్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘భారత్‌ కచ్చితంగా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఆ దేశంతో అమెరికాకు బలమైన సత్సంబంధాలున్నాయి. చాలా విషయాల్లో రెండుదేశాల మధ్య దగ్గరి పోలికలున్నాయి. రెండూ ప్రజాస్వామ్య దేశాలే క ఆకుండా పెద్ద దేశాలే.’ అని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ విలేకరులతో అన్నారు. వారం చివర్లో ట్రంప్‌ ఆసియా పర్యటన మొదలుపెట్టనున్నారు. జపాన్‌, దక్షిణకొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో 12 రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే భారత్‌కు మాత్రం రావడం లేదు. అమెరికాకు భారత్‌ ముఖ్యదేశం అయినప్పుడు.. ట్రంప్‌ ఎందుకు వెళ్లడం లేదంటూ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన శాండర్స్‌.. ఇప్పుడే షెడ్యూల్‌ చాలా పెద్దదైందని.. మరోసారి భారత్‌లో ప్రత్యేకంగా పర్యటిస్తారని చెప్పారు. అయితే ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో భారత్‌ పెద్దన్న పాత్రను పోషించాలని.. వైట్‌హౌస్‌ అభిప్రాయపడింది. ఈ సమయంలోనే ఆమె ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో భారత్‌ పెద్దన్న పోషించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో అమెరికాకు భారత్‌ అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక, కీలక భాగస్వామి అని సారా శాండర్స్‌ తెలిపారు. కొంతకాలంగా భారత్‌తో అమెరికా వ్యూహాత్మక, రక్షణ, ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థితరం చేసుకుంటోందని సారా తెలిపారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌తో పాటు.. మొత్తం ప్రపంచానికి శాంతిని ఇవ్వగలిగే సత్తా భారత్‌కు ఉందని ఆమె అన్నారు. ఈ పర్యటనలో భారత్‌కు ట్రంప్‌

వెళ్లడం లేదని, అయితే అమెరికాకు భారత్‌ ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు. భారత్‌తో ఉన్న బలమైన బంధం దృష్ట్యా.. హడావిడి షెడ్యూల్‌తో అక్కడకు వెళ్లేందుకు ట్రంప్‌ ఇష్టపడడం లేదని ఆమె స్పష్టం చేశారు.