ఇందిరకు నివాళి అర్పించిన కాంగ్రస్
ఆమె జ్ఞాపకాలు మరువలేనివన్న రాహుల్
న్యూఢిల్లీ,అక్టోబర్31(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు.శక్తిస్థల్ వద్దకు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లతో కలిసి వెళ్లి సమాధిపై పూలు ఉంచి నమస్కరించారు. ‘ మనసు నిండా ఆనందంతో ఈరోజు నానమ్మను గుర్తుచేసుకుంటున్నా. ఆమె నాకు ఎంతో నేర్పించారు. అంతులేని ప్రేమను పంచారు. ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆమె పట్ల ఎంతో గర్వపడుతున్నా’ అని రాహుల్ ఇందిరాగాంధీని గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. భారత తొలి మహిళా ప్రధాని, దేశంలోని బలమైన నేతల్లో ఒకరైన ఇందిరాగాంధీకి నివాళులర్పిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఆమె నాయకత్వంలో దేశం గొప్ప విజయాలను, అద్భుతమైన అభివృద్ధిని, సమాజంలోని వివిధ వర్గాల ఉద్ధరణను చూసిందని ట్వీట్లో పేర్కొంది. 1984 అక్టోబరు 31వ తేదీన సఫ్దర్గంజ్ రోడ్-1లోని ఆమె ఇంట్లో ఇందిరాగాంధీని ఇద్దరు భద్రతా సిబ్బంది కాల్చి చంపారు.