ఇందిరకు పలువురు నివాళి
శక్తిస్థల్ వద్ద నివాళి అర్పించిన మన్మోహన్, ప్రణబ్,సోనియా
న్యూఢిల్లీ,నవంబరు19(జనం సాక్షి): మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇందిరకు నివాళులు అర్పించారు. ఆయన ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు. ఆమె దేశానికి చేసిన సేవలను, ఆమె త్యాగాలను ఆయన కొనియాడారు. శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు ఇందిరకు నివాళి అర్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులు ఇందిరా సమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా ఇందిరకు నివాళి అర్పించింది. ఇందిర ఆశయాల సాధనలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు సాగాలని కాంగ్రెస్ ఆకాంక్షించింది. జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, విదేశీ విధానం తదితర అంశాల్లో ఇందిర ఎన్నో సంస్కరణలు చేసిందని కాంగ్రెస్ తన ట్విట్టర్ లో వెల్లడించింది.