ఇది ట్రైలర్‌ మాత్రమే..


– 2019లో అసలైన సినిమా చూపిస్తాం
– ఈ గెలుపు ప్రజలకు మాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం
– రాష్ట్రాన్ని క్లీన్‌ స్వీప్‌ చేయడమే మా లక్ష్యం
– కూటమి బతకలేదన్న బీజేపీ నేతలు.. ఇప్పుడేం చెబుతారు?
– కర్ణాటక సీఎం కుమారస్వామి
బెంగళూరు, నవంబర్‌6(జ‌నంసాక్షి) : కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని… 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 28 లోక్‌ సభ స్థానాలు ఉన్నాయని, కాంగ్రెస్‌ పార్టీతో కలసి అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేడు గెలిచాం కాబట్టి తాను ఈ మాటలు అనడం లేదని, తమపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలందరినీ అభినందిస్తున్నానని కుమారస్వామి తెలిపారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన జేడీఎస్‌ నేతలను, కార్యకర్తలను కూడా అభినందిస్తున్నానని అన్నారు. జీడీఎస్‌-కాంగ్రెస్‌ లది అపవిత్ర కలయిక అని వ్యాఖ్యానించిన బీజేపీకి ఈ ఫలితాలు చెంపపెట్టువంటివని చెప్పారు. తమ కూటమి ఎంతోకాలం బతకదని ఎద్దేవా చేసిన బీజేపీ నేతలు ఈ ఫలితాల తర్వాత ఏం మాట్లాడతారని అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్‌ స్వీప్‌ చేయడమే తమ కూటమి తదుపరి లక్ష్యమని చెప్పారు. టిప్పు సుల్తాన్‌ జయంతిని నిర్వహించాలని కానీ, నిర్వహించకూడదని కానీ తాను ఎన్నడూ అనలేదని కుమారస్వామి తెలిపారు. దేశంలో ఎన్నో సామాజికవర్గాలు ఉన్నాయని వాళ్ల నేతల జయంతిలను వివిధ వర్గాల ప్రజలు నిర్వహించుకోవడం సాధారణ విషయమేనని చెప్పారు. బీజేపీవాళ్లు ఈ ఉత్సవాల్లో భాగం కాకూడదని భావిస్తే వారు దూరంగా ఉండవచ్చని కుమారస్వామి సూచించారు. కాగా కర్ణాటకలో మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలు మొత్తం ఐదు స్థానాల్లో ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కేవలం ఒక్కలోక్‌సభ స్థానం మినహా మిగిలిన రెండు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి కైవసం చేసుకుంది. కనీసం మూడు స్థానాల్లోనైనా పాగా వేస్తామని భావించిన బీజేపీకి ఈ ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిలిచ్చాయి.
దక్షిణాదిలో రామ మందిరంలాంటి డ్రామాలు చెల్లవు-శివకుమార్‌
కర్ణాటక ఉపఎన్నికలలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ స్వీప్‌ చేయడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి శివకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎత్తుగడలు పారవని ఆయన అన్నారు. రామ మందిరంలాంటి అంశాలను దక్షిణాదిలో రాజకీయ అస్త్రాలుగా మలచలేరని చెప్పారు. దక్షిణాది ప్రజలు సామాజిక, ఆర్థిక భద్రత, మెరుగైన పాలన, పారదర్శకత వంటివాటినే పట్టించుకుంటారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే అంతిమమని అన్నారు. బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని… 2019లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేదానికి ఈనాటి ఫలితాలు ఒక ఉదాహరణ అని చెప్పారు.