ఈనెల చివరిలోపు కూటమిలో..  సీట్ల సర్దుబాటు పూర్తవుతుంది


– చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి
– కాంగ్రెస్‌లో టికెట్‌లురాని వారికి పదవులు ఇచ్చి న్యాయం చేస్తాం
– 20న రాహుల్‌ పర్యటన ఎన్నికల ప్రచారంలోభాగమే
– త్వరలో సోనియాగాంధీ పర్యటన ఉంటుంది
– విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా
న్యూఢిల్లీ, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : ఈనెల చివరిలోపు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా తెలిపారు. బుధవారం ఢిల్లీలో పార్టీ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీలను కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. మహాకూటమి, సీట్ల సర్దుబాటు అంశాలపై చర్చించారు. తెదేపా, సీపీఐ, తెజస నేతలతో చర్చించిన అంశాలను కోర్‌కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. భేటీ అనంతరం కుంతియా విూడియాతో మాట్లాడారు.
మహాకూటమి పొత్తు, సీట్ల సర్దుబాటు అంశాలపై సీనియర్‌ నేతలతో చర్చించామన్నారు. తెజేసా, సీపీఐ,
తెదేపా నాయకులతో చర్చించిన అంశాలను కోర్‌ కమిటీ దృష్టికి తీసుకొచ్చామని కుంతియా తెలిపారు. మహాకూటమిపై చర్చలో పురోగతి బాగుందని, చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, త్వరలోనే పొత్తు, సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందన్నారు. తెజస, కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు విషయంలో దుష్పచ్రారం జరుగుతోందని కుంతియా ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో మూడుసార్లు కోదండరాంతో చర్చించినట్లు తెలిపారు. ఈ నెల చివరిలోపు మహాకూటమి, సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని తెలిపారు. ఈనెల 20న తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన కేవలం ఎన్నికల ప్రచారంలోభాగమేనని తెలిపారు. త్వరలో సోనియా కూడా రాష్ట్రంలో పర్యటిస్తారని, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులున్నారని అన్నారు. అందరికీ న్యాయం చేస్తామని, టికెట్‌రాని వారికి పదువుల ఇస్తామని కుంతియా తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమ్మెల్సీ లేదా పార్టీ పదవులు ఇచ్చి సముచితంగా గౌరవిస్తామని తెలిపారు. టికెట్‌ రాని వారు నిరాశ చెందొద్దని కంతియా సూచించారు.