ఈసీ ఆదేశాలను..  శిరసావహించాల్సిందే!


– అధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన న్యాయస్థానం
– ఈసీ ఆదేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేమని వెల్లడి
– హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
అమరావతి, మార్చి29 (జ‌నంసాక్షి) : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను శిరసా వహించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ, కడప, శ్రీకాకుళం ఎస్పీలను అకస్మాత్తుగా ఎన్నికల కమిషన్‌ బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఐపీఎఎస్‌ల బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీల బదిలీలపై గురువారం సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సమర్థిస్తూ సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించగా, ఎన్నికల విధులతో సంబంధం లేని ఇంటెలిజెన్స్‌ డీజీని బదిలీ చేసే అధికారం ఈసీఐకి లేదని ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల విధులు అప్పగించిన పోలీసు అధికారుల జాబితాను న్యాయస్థానానికి అందజేసిన అడ్వొకేట్‌ జనరల్‌ ఇందులో ఇంటెలిజెన్స్‌ డీజీ లేరని తెలిపారు. ఈసీఐ ఉత్తర్వుల్లో బదిలీ కారణాలను తెలుపలేదని, బదిలీ అయినవారి స్థానంలో నియమించేందుకు మూడు ప్యానల్‌ పేర్లను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం
రాష్ట్ర అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని తెలిపారు. ఎస్పీల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఈసీఐకి ఉండొచ్చు కానీ, డీజీ వ్యవహారంలో జోక్యానికి వీల్లేదని అన్నారు. ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులపై ఈసీఐ జోక్యం తగదని 1978లో సుప్రీంకోర్టు తీర్పును ఉదాహరణగా చూపారు. అయితే వీటిని తోసిపుచ్చిన ధర్మాసనంపై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.