ఉత్తిమార్గదర్శకాలు వద్దు

– కఠిన నిర్ణయాలు తీసుకోండి

– కేంద్రానికి సుప్రీం సూచన

దిల్లీ,నవంబరు 27(జనంసాక్షి): కరోనా కట్టడికి కేవలం మార్గదర్శకాలు జారీ చేస్తే సరిపోదని, వాటిని కఠినంగా అమలయ్యేలా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాల నిర్వహణపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ధర్మాసనం పెదవి విరిచింది. ఈ సందర్భంగా గుజరాత్‌లోని కరోనా ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సుప్రీంకోర్టుగ్భ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రాజకీయాలకు అతీతంగా మహమ్మారిపై పోరాటం చేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘క్షేత్రస్థాయిలో మాస్క్‌లు ధరించడంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. 80శాతం ప్రజలు మాస్క్‌లు పెట్టుకోవట్లేదు. మిగతా వాళ్లు పెట్టుకున్నా వాటిని దవడ కిందకు వేలాడదీస్తున్నారు. పరిస్థితి దారుణం నుంచి తీవ్రంగా మారింది. డిసెంబరులో మరింత దిగజారే ప్రమాదం ఉంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలి. మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలి. అన్ని రాష్ట్రాల్లో నిబంధనలు పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కరోనా ఆసుపత్రిలో గత శుక్రవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన గురించి సుప్రీంకోర్టు ఆరా తీసింది. కరోనా ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని, కేంద్రం మార్గదర్శకాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తాము సుమోటాగా తీసుకున్నట్లు వెల్లడించింది. రాజ్‌కోట్‌ ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అంతేగాక, రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా.. వివాహాది శుభకార్యాలపై ఎందుకు నిబంధనలు తీసుకురాలేదని గుజరాత్‌ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్న ఎందుకు వేడుకలకు అనుమతిస్తున్నారని దుయ్యబట్టింది. కరోనా పరిస్థితిపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలంటూ దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరగకుండా కేంద్రం కఠిన ఆదేశాలు జారీ చేస్తుందని హావిూ ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున రాజ్‌కోట్‌లోని కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 26 మంది రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.