ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తా చాటుతాం

ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తాం: టిడిపి ఎమ్మెల్యే
ఖమ్మం,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నచోట్ల ప్రాదేశిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను రంగంలోకి దింపుతామని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు తెలిపారు. టిడిపిని వీడి కొందరు వెల్లినా పోటీ ఆగదన్నారు. అలాగే పార్టీ బలహీనపడదన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి జడ్‌పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని మెచ్చా ప్రకటించారు. అశ్వారావుపేట, చండ్రుగొండ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. టీడీపీ పోటీ చేసే మండలాల ఎంపీపీలు కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌ పోటీ చేసే మండలాల ఎంపీపీలు టీడీపీకి కేటాయించుకున్నామని వివరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ స్థానాలు కైవశం చేసుకుంటామని  అన్నారు. నాడు నామాను వ్యతిరేకించిన తుమ్మల.. తిరిగి నామాకు ఓట్లు వెయ్యాలని ప్రచారం చేయడంతో ఆయన నైతిక విలువలు కోల్పోయినట్లయిందని విమర్శించారు. ఇదిలావుంటే   టీఆర్‌ఎస్‌ దమ్మపేట మండలాధ్యక్షుడు పానుగంటి సత్యం తిరిగి టీడీపీలో చేరారు.  టీడీపీలోకి తిరిగి సత్యం రావడం శుభ పరిణామన్నారు. సత్యాన్ని దమ్మపేట జడ్‌పీటీసీ కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. సత్యం దమ్మపేట సర్పంచ్‌గా, ఎంపీపీగా ఒక్కో పర్యాయం పనిచేశారని గుర్తు చేశారు. 1988లో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరారని చెప్పారు. తుమ్మలతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరే వరకు టీడీపీ మండల అధ్యక్షుడిగా పని చేసారు.