ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే

4

– జనం మనసు గెలుచుకున్న కేసీఆర్‌

– మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఏ ఎన్నికలైనా అందులో గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టిదేనని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని నిలుపున్నారని ఆయన కొనియాడారు. త్వరలో జరగబోయే గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం పురపాలక సంస్థల ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తీరుతో వరంగల్‌ నగరం నిర్లక్ష్యానికి గురవుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌ స్మార్ట్‌సిటీగా ఎందుకు ఎంపిక కాలేదో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే భాజపా నేతలు ప్రచారం చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చెల్లని రూపాయిగా మారిన భాజపా… వరంగల్‌లో చెల్లుతుందా? అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.