ఎన్ఐఏ అధికారి హత్యకేసులో పురోగతి
పోలీసుల అదుపులో ఇద్దరు ఆగంతకులు
న్యూఢిల్లీ,ఏప్రిల్7 జనంసాక్షి: గత వారం ఉత్తరప్రదేశ్లో జరిగిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి తాంజిల్ అహ్మద్ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో షార్ప్ షూటర్ ఒకరు ఉన్నట్లు తెలిపారు. ఎన్ఐఏ అధికారి కారును ఛేజ్ చేయడానికి ఉపయోగించిన బైక్ను కూడా గుర్తించినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామని చెప్పారు. తాంజిల్ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో కుటుంబసభ్యులతో కలిసి దిల్లీకి తిరిగి వస్తుండగా దుండగులు మార్గ మధ్యలో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల సమయంలో పక్కనే ఉన్న తాంజిల్ భార్యకు బుల్లెట్ గాయాలవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు కూడా పక్కనే ఉన్నారు. ఈ హత్య దేశంలో తీవ్ర సంచలనం కలిగించింది. దర్యాప్తును పక్కదోవ పట్టించడం లేదా, తప్పించడం కోసం దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.