ఎన్‌కౌంటర్‌లో 8ఏళ్ల బాలుడు మృతి

మథుర, జనవరి18(జ‌నంసాక్షి) : పోలీసులు, నేరగాళ్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలుడు బలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ ఘటన జరిగింది. గత రాత్రి పోలీసులకు, నేరగాళ్లకు మధ్య కాల్పులు జరుగుతుండగా మాధవ్‌ భరద్వాజ్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడి తలకు బుల్లెట్‌ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల దోపిడీ చేసిన దుండగులు మోహన్‌పూర్‌ గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా దుండగులు కాల్పులు జరిపారని, దీంతో తాము కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు. బాలుడికి తగిలిన బుల్లెట్‌ పోలీసుల తుపాకీ నుంచి తగిలిందా లేదా క్రిమినల్స్‌ బుల్లెట్‌ నుంచి తగిలిందా అనే విషయం తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. నేరగాళ్లు మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం హావిూ ఇచ్చింది. బాలుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.