ఎపిలో ఉత్సాహంగా రాష్ట్రపతి ఎన్నిక

తొలుత ఓటేసిన సిఎం జగన్‌
తదుపరి స్పీకర్‌ తమ్మినేని, మంత్రుల ఓటు
చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేల ఓటు

అమరావతి,జూలై18(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ఉత్సాహంగా ప్రారంభ మయ్యింది. తొలుత సిఎం జగగన్‌ ఓటేశారు. టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యేలు కూడా వరుసగా ఓటేశారు. అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్తులో ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. పోలింగ్‌ ప్రారంభం కాగానే…ఏపీ అసెంబ్లీకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి ఓటు వేశారు. తరవాత స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, సహచర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, సురేష్‌, తానేటి వనిత ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్‌ భారతి, ఎన్నికల స్పెషల్‌ ఆఫీసర్‌ సంతోష్‌ అజ్మీరాలు అమరావతి చేరుకుని అసెంబ్లీ ప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 174 మంది ఇక్కడ తమ ఓటు వేయనున్నారు. కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి హైదరాబాదులో ఓటు వేసారు. 175 మంది ఎమ్మెల్యేల్లో వైసీపీకి 151, టీడీపీకి 23 మంది ఉన్నారు. ఒక ఓటు జనసేనకు ఉన్నా.. ఆయన వైసీపీలో చేరిపోవడంతో ఆయన కూడా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ రెండూ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ప్రకటించాయి. మొత్తం ఓటింగ్‌ పక్రియను వీడియో రికార్డింగ్‌ చిత్రీకరిస్తున్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత మంగళవారం బ్యాలెట్‌ బాక్సులను ప్రత్యేక విమానంలో ఢల్లీికి తరలించనున్నారు. వైసీపీ నేతల పోలింగ్‌
ముగిసిన తర్వాత.. టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించు కున్నారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఓటేశారు.