ఎయిర్‌ విస్తారాలో నటి వసీంపై లైంగిక వేధింపులు

ముంబై ,డిసెంబర్‌ 10,(జనంసాక్షి):బాలీవుడ్‌ నటి జైరా వసీమ్‌ పై లైంగిక వేధింపుల కేసు వివాదం మరింత ముదురుతోంది. ఎయిర్‌ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఆరోపించింది. విమానంలో తనకు ఎవరూ సాయం చేయలేదంటూ చేసిన వ్యాఖ్యలపై ఎయిర్‌ లైన్స్‌ అధికారులు స్పందించారు. ముంబైలో విమానం దిగే వరకూ తనపై జరిగిన లైంగిక వేధింపుల విషయాన్ని సిబ్బంది దృష్టికి జైరాగానీ, ఆమె తల్లి గానీ తీసుకురాలేదని స్పష్టం చేశారు.మాకు విషయం తెలిసిన వెంటనే వారిని సంప్రదించాం. ఫిర్యాదు చేయాలనుకుంటే సహకరిస్తామని ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది చెప్పగా అందుకు జైరా, ఆమె తల్లి నిరాకరించినట్లు ఆ అధికారి వెల్లడించారు. నటికి ఎదురైన వేధింపుల వివాదం సోషల్‌ విూడియాలో హల్‌చల్‌ చేయడంతో ముంబై పోలీసులు స్పందించారు. జైరా వసీమ్‌ను ప్రత్యేకంగా కలిసిన ముంబై పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఎయిర్‌ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి సీటుపై కాలుపెట్టి, అసభ్యంగా తాకాడని ఆమె ఓ వీడియో ద్వారా ఆరోపించగా వేధింపుల ఘటన వెలుగుచూసింది.