ఎయిర్ హోస్టెస్ పట్ల పపూయాదవ్ అసభ్య ప్రవర్తన

బీహార్:బీహార్‌కు చెందిన ఎంపీ పప్పూ యాదవ్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ ఎయిర్‌హోస్టెస్ ఆరోపించింది. పప్పూయాదవ్ జెట్ ఎయిర్‌వేస్ విమానంలో పాట్నా నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప్రయాణంలో ఎంపీ తాను తినగా మిగిలినపోయిన ఆహారాన్ని సీట్ల మధ్యలో పడవేశాడు. ఇది గమనించిన ఎయిర్‌హోస్టెస్ మిగిలిపోయిన ఆహారాన్ని అలా పడవేయొద్దని కోరారు. తన చర్యను ప్రశ్నించినందుకుగాను ఎంపీ ఎయిర్‌హోస్టెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం. పప్పూ బెదిరింపులపై ఫ్లైట్ కెప్టెన్ ఢిల్లీ ఏటీసీకి సమాచారం అందించి రక్షణ కల్పించాల్సిందిగా కోరినట్లు జెట్‌ఎయిర్‌వేస్ సంస్థ పేర్కొంది. తనపై వచ్చిన ఆరోపణలను పప్పూయాదవ్ తోసిపుచ్చారు. ఎయిర్‌హోస్టెస్ ఆరోపిస్తున్నట్లుగా విమానంలో అటువంటి చర్యేది జరగలేదన్నారు. జరిగిన ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాష్ట్రీయ జనతాదళ్ పప్పూయాదవ్‌ను పార్టీ నుంచి గడిచిన మే నెలలో బహిష్కరించిన విషయం తెలిసిందే.