ఏపీలో అవినీతి వారసుల ప్రభుత్వం సాగుతుంది

– టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
అమరావతి, జులై22 (జ‌నంసాక్షి): ఏపీలో అవినీతి వారసుల ప్రభుత్వం సాగుతుందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి విమర్శించారు. బుధవారం ఆయన అసెంబ్లీ ఆవరణంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. అవినీతి వారసుల ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విమర్శించారు. ఆనాడు రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన 14లక్షల ఇళ్లు ఎక్కడున్నాయో తెలియదని అన్నారు. రూ. 4 వేల కోట్ల దోపిడీ హౌసింగ్‌లో జరిగిందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గత రెండేళ్లలో 7లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని గోరంట్ల తెలిపారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు కడతామని చెబుతోందని, ప్రభుత్వం బ్జడెట్‌లో కేటాయించిన మొత్తం చూస్తే నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ళు సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఆదాయం మిగులు ఉన్న తెలంగాణలో 22వేల ఇళ్లు కూడా కట్టలేదని అన్నారు. గతంలో సరైన ఇన్ఫాస్టక్చర్ర్‌ లేకుండా ఇళ్లు కట్టారని, టీడీపీ హయాంలో అన్ని వసతులతో ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. కోస్తా జిల్లాల్లో అసలు స్థలాలు లేవని, ఈ ప్రభుత్వం 25లక్షల ఇళ్ల స్థలాలు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందని గోరంట్ల విమర్శించారు.