ఏపీ ఆర్థికపతనానికి బాబేకారణం!

– చివరి ఏడాదిలోనే భారీగా అప్పులు చేశారు
– పుట్టబోయే ప్రతిబిడ్డపై రూ.40వేలమేర అప్పుంది
– వైసీపీ నేత, మాజీ మంత్రి రామనారాయణరెడ్డి
నెల్లూరు, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : ఏపీ ఆర్థికంగా పతనం కావడానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రభుత్వ ఆర్థికశాఖను ఒక ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వహించడం దారుణమని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా పతనం కావడానికి చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. తొమ్మిది నెలల్లో తీసుకోవాల్సిన అప్పులను ఒక నెలలోనే బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకుని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెలా ప్రభుత్వం ఓవర్‌ డ్రాఫ్ట్‌ కింద మొత్తం 26 వేల 22 కోట్ల రూపాయలను ప్రభుత్వ తీసుకుందన్నారు. వేస్‌అండ్‌ విూన్స్‌ కింద గత రెండు నెలలుగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. చేసిన అప్పులతో తమకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోందని, చివరి సంవత్సరంలోనే ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. పుట్టబోయే బిడ్డ విూద కూడా 40వేల రూపాయల మేర అప్పు ఉందని ఆనం పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన ఆర్థిక తప్పిదాలను ప్రతి నిపుణుడూ విమర్శిస్తున్నారని రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వహిస్తోందన్నారు. ఆర్థిక శాఖలోని విభాగాలను ఎన్నారై వాసిరెడ్డి కృష్ణ దేవరాయలు నిర్వహించారని విమర్శించారు. సిఎఫ్‌ఎంఎస్‌ను ఏర్పాటు చేసి దానిని కృష్ణదేవరాయలు చేతిలో పెట్టారు. ఆర్థికశాఖ లో అవకతవకలను ప్రశ్నించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విమర్శించిన సీఎం, ఆర్థిక మంత్రి తీరు సరికాదన్నారు. ఆర్థిక శాఖలో అవకతవకలను చూసి ఐఏఎస్‌ అధికారులు సెలవుపై పోతున్నారన్నారు. టీటీడీ బంగారం తరలింపులో సూత్రధారులు, పాత్రధారులను బయట పెట్టాలని రాంనారాయణ డిమాండ్‌ చేశారు. ఆర్థికశాఖ తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.