ఏపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో ఎట్లా వోటేస్తావ్..
– బాలకృష్ణను అనర్హురిడిగా ప్రకటించాలి
– పొన్నం ప్రభాకర్
హైదరాబాద్,ఫిబ్రవరి 4(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న సినీనటుడు బాలకృష్ణ తెలంగాణలో తనకు సంబంధం లేని జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడం పూర్తిగా చట్ట విరుద్ధం, ఎన్నికల నియమావళి ప్రకారం శాసనసభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనంతపూర్ జిల్లాకు చెందిన హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్ డివిజన్లో ఓటు వేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉంటే ఆ రాష్ట్రంలోని శాసనసభకు పోటీ చేయొచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాంటి నిబంధన ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే గా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని పొన్నం ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం చెల్లుబాటు కాదని, అందువల్ల ఆయనను తక్షణం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం లోక్ సభకు పోటీ చేయడానికి దేశంలోని ఏ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్నా సరిపోతుందని, కానీ అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. అలాగే ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే సంబంధిత జిల్లాలో ఓటరై ఉండాలి. ఎన్నికల నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ బాలకృష్ణ మరో రాష్ట్రంలో ఓటు వేయడం చట్ట వ్యతిరేక చర్య అవుతుందని, తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని ప్రభాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు తన ఫిర్యాదును అందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉంటూ గ్రేటర్ ఎన్నికల్లో ఎలా ఓటువేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నవారికి సొంత రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉండాలని,అలాంటిది హైదరాబాద్ లో బాలకృష్ణ ఎలా ఓటు కలిగి ఉంటారని, ఆయన ప్రశ్నించారు.