ఏసీ వాడారని భార్య.. కొడుకును చంపేశాడు!
అంగమాలి: వద్దని చెప్పినా ఏసీ వాడారన్న కోపంతో భార్య, అనారోగ్యంతో ఉన్న కొడుకును అతి దారుణంగా చంపేశాడో వృద్ధుడు.కేరళలోని అంగమలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
85ఏళ్ల పాల్ పైనదతు అనే వృద్ధుడు రైల్వేశాఖలో పనిచేసి రిటైర్ అయ్యాడు. గత కొన్ని రోజులుగా ఏసీ విషయమై పాల్ దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో ఏసీ వినియోగించొద్దని పాల్ తన కుటుంబసభ్యులను హెచ్చరించాడు. అయితే అనారోగ్యంతో ఉన్న 54 ఏళ్ల కుమారుడి కోసం పాల్ భార్య గత రాత్రి ఏసీ ఆన్ చేసింది.
దీంతో ఆగ్రహానికి గురైన పాల్.. పదునైన ఆయుధంతో తన భార్య, కొడుకును దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఖతార్లో ఉన్న తన మరో కుమారుడికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపాడు. అంతేగాక.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో పాల్ కుమారుడు తమ బంధువులు, పోలీసులకు సమాచారమందించాడు. పాల్ను అరెస్టు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.