ఐదేళ్లలో లక్షల కోట్లు దోచుకున్నారు
– బాబు యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నాడు
– వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
అమరావతి, ఏప్రిల్22(జనంసాక్షి) : ఐదేళ్లలో చంద్రబాబు, తన అనుచరులు కలిసి లక్షల కోట్లు ప్రజాసొమ్మును దోచుకున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ నిర్ణయానికి అధికారులు వత్తాసు పలకాలని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం దారుణమని అన్నారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై యనమల వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. ఏపీలో జరిగినంత ఘోరమైన పాలన దేశంలో ఎక్కడ చూడలేదని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీకి డబ్బు సర్దిన వారికే ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారన్నారు. కాంట్రాక్టులనీ తన సామాజికి వర్గానికి చెందిని వారికే ఇచ్చుకున్నారని ఆరోపించారు. హుద్ హుద్ తుపాన్ పేరుతో టీడీపీ నేతలు పేద ప్రజల భూములు దోచుకున్నారని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు మాజీ సీఎస్లు చెప్పిన మాటలు వింటుంటే ప్రజాస్వామ్యం ఎంత అభాసుపాలైందో అర్థమవుతుందన్నారు. మాజీ సీఎస్ ఐవైఆర్, అజయ్ కల్లాం వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిఖశాఖ కార్యదర్శి రవిచంద్ర ఎందుకు సెలవుపై వెళ్లారని ప్రశ్నించారు. ప్రతిపక్షం కదలికలపై నిఘాకోసం పోలీస్ శాఖకు వేల కోట్లు కేటాయించారన్నారు. చంద్రబాబు యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. నెల రోజుల్లో ఖాళీ చేసే టీడీపీ ప్రభుత్వ అక్రమాలకు అధికారులు ఎవరూ సహకరించడవద్దని కోరారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాధనం దోచుకున్నవారికి శిక్ష తప్పదని బొత్స హెచ్చరించారు.