ఓటు వజ్రాయుధం

4

– రాజ్యాంగ హక్కును వినియోగించుకోండి

– జస్టిస్‌ సుభాషన్‌ రెడ్డి

హైదరాబాద్‌,జనవరి25(జనంసాక్షి): రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయడమన్నది బాధ్యతగా గుర్తించాలన్నారు. నూటికినూరుశాతం మంది ఓటేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడగలదని అన్నారు. హైదరాబాద్‌  రవీంద్రభారతిలో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోకాయుక్త జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ఓటర్‌ గుర్తింపు కార్డులు సుభాషణ్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి భన్వర్‌ లాల్‌ సిఎస్‌ రాజీవ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తెలంగాణ పది జిల్లాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. నల్లగొండలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ పాల్గొని ప్రారంభించారు. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు ప్రారంభించారు.