ఓవైసీ సోదరులపై కేసు నమోదు
– కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్,ఫిబ్రవరి 3(జనంసాక్షి):పాత బస్తీ ఘటనలపై పోలీసులు దిదద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ , షబ్బీర్లపై దాడికి కారణమైన వారిపై కేసులు నమోదు చేశారు. అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎం కార్యకర్తలపై పలు కేసులు నమోదు చేశారు. మొత్తం 149 కేసులు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. అలాగే అసద్ సోదరుడు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. జంగంమెట్ భాజపా అభ్యర్థిపై దాడిఘటనలో ఎమ్మెల్యే సహా, ఇతర నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే పాషాఖాద్రీ దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణను కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీపై దాడిఘటన కేసులో నిందితుల అప్పగింతపై చర్చించినట్లు సమాచారం. ఇకపోతే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి తో పాటు షబ్బీర్ అలీపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. పాతబస్తీలో పోలింగ్ సందర్భంగా భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లుగా మాట్లాడటం వల్ల కోపోద్రిక్తులైన మహమ్మద్ ఆబిద్, మహమ్మద్ కశాప్ అనే ఇద్దరు వ్యక్తులు టీపీసీసీ అధ్యక్షుడిపై దాడీకి యత్నించారు. ఎంఐఎం రిగ్గింగ్కు పాల్పడిందని ఆరోపించడంతోనే ఇలా చేసామని నిందితులు సౌత్ జోన్ డీసీపీ ఎదుట లొంగిపోయారు.
కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్అలీపై జరిగిన దాడి కేసులో హబీబ్, మహ్మద్ కశబ్ను విూర్చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా వీడియో ఫుటేజీలో లభించిన ఆధారాల ప్రకారం హబీబ్, కశబ్ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. హబీబ్, కశబ్ను దక్షిణ మండల డీసీపీ ఆఫీసుకు తరలించారు. నిందితులను గురువారం ఉదయం కోర్టులో ప్రవేశపెడుతామని చెప్పారు. కశబ్ ఓల్డ్ మలక్ పేటకు చెందిన వాడు. కాలాపత్తర్ కు చెందిన షేక్ ఓబేద్ ఉన్నారు. వీరిని అరెస్ట్ చేశాక డీసీపీ కార్యాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో కాంగ్రెస్ నాయకులపై దాడికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని దక్షిణ మండల డీసీపీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. పాతబస్తీ ఘటనలో అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను రేపు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితులిద్దరినీ విచారిస్తున్నామని… విచారణ రేపు ఉదయానికి పూర్తవుతుందని తెలిపారు. వీడియో పుటేజి ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే బలాలకు బెయిలు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపై దాడి కేసులో మలక్పేట ఎమ్మెల్యే బలాలకు బెయిల్ మంజూరైంది. బలాలపై మలక్పేట పోలీస్స్టేషన్లో ఐపీసీ 341, 448, 427, 506, 147, 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లి కోర్టు బలాలకు బెయిల్ మంజూరు చేసింది. గ్రేటర్ ఎన్నికల సందరర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ తనయుడు అజం అలీపై దాడికి యత్నించిన ఎమ్మెల్యే బలాలను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. బుధవారం ఉదయం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి బలాలను నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మహముద్ అలీ తనయుడు అజం అలీపై బలాల దాడికి యత్నించారు. బలాలను చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం పాతబస్తీతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో మజ్లిస్ దాడులతో ఉద్రిక్తతలకు కారణమైంది. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరి పైనా కాలుదువ్వింది. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి ప్రముఖులపైనా పిడిగుద్దులతో దాడులకు పాల్పడ్డారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ అసదుద్దీన్, ముగ్గురు ఎమ్మెల్యేలు స్వయంగా దాడులు, బెదిరింపుల్లో పాల్గొన్నారు. కాగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, మజ్లిస్ను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్పై ఖాద్రీ దాడికి యత్నించడంతో వివాదం చెలరేగింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు గౌస్ను అరెస్టు చేసిన పోలీ సులు విూర్చౌక్ పోలీసుస్టేషన్కు తరలించారు. పాషా ఖాద్రీని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విూర్చౌక్ ఠాణాలో బీభత్సం సృష్టిం చారు. ఖాద్రీతో పాటు అరెస్టైన ఇద్దరు ఎంఐ ఎం కార్యకర్తల్ని బలవంతంగా అక్కడ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో పోలీసులు చేసిన విజ్ఞప్తినీ ఎంపీ పట్టించుకోకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. దీనిపై దుమారం చెలరేగింది.