కమర్షియల్ టాక్స్లో సర్కిల్ వారిగా ప్రగతిని సమీక్షించండి
` రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి
`ఆదాయ వనరుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్్(జనంసాక్షి):కమర్షియల్ టాక్స్ శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిల్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సమావేశం సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుదిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వివిధ రకాల వస్తువుల వారీగా సమీక్ష చేయాలని ఆదేశించారు. కమర్షియల్ టాక్స్ విభాగానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి అన్నారు. స్టాంప్స్ మరియు రెవె న్యూ శాఖలో ఆదాయం పెంపునకు గత సంవత్సరం వేసిన కమిటీ, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు పరిస్థితిపై డిప్యూటీ సీఎం సమీక్షించారు. స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖతో ముడిపడి ఉన్న హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హౌసింగ్ బోర్డు వంటి ఇతర శాఖలను సమన్వయం చేసుకొని ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలను సమన్వయం చేసుకునే అంశాన్ని చీఫ్ సెక్రటరీ సీరియస్గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుదలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక తెప్పించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును డిప్యూటీ సీఎం ఆదేశించారు. రవాణా శాఖలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణాలు వాటిని అధిగమించేందుకు అలాంటి చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని మంత్రులు తెలిపారు. ఆదాయ వనరుల సమీక్ష సమావేశానికి వచ్చే ముందు అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆయా శాఖలో ఆదాయం పెంపుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక స్పష్టమైన నివేదికతో సమావేశానికి హాజరుకావాలని డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రం ఐదు వేల కోట్ల ఆదాయం కోల్పోతుంది
` పేద, మధ్యతరగతి, రైతాంగ వర్గాల మేలు కోసం విధాన నిర్ణయం
` వ్యాపారుల సమస్యలు చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచే ఉన్నాయి
` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్(జనంసాక్షి):జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.. అయినప్పటికీ పేద, మధ్యతరగతి రైతాంగ కుటుంబాల మేలు కోసం జిఎస్టి రేషినేలైజేషన్ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి యావత్ క్యాబినెట్ ఒక విధాన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో వ్యాపార వర్గాలతో డిప్యూటీ సీఎం ఇంట్రాక్షన్ కార్యక్రమం కమర్షియల్ టాక్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగింది.సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ఎదుగుదల కోసం ప్రజా ప్రభుత్వం ఐదువేల కోట్ల ఆదాయం కోల్పోతున్నప్పటికీ జీఎస్టీ రేట్ల సవరణ విధాన నిర్ణయంలో ప్రధాన భూమిక పోషించింది అన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జీఎస్టీ కౌన్సిల్ సభ్యునిగా ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకోవడంలో తాను ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. జీఎస్టీ రేట్ల సవరణ కోట్లాదిమందికి ఉపయోగపడే కార్యక్రమం అన్నారు. సవరించిన రేట్లతో పెద్ద సంఖ్యలో వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తున్నాయి ఆ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం, వ్యాపారులు అందరిపైనా ఉంది అన్నారు. జీఎస్టీ లో సులభమైన విధానం తెచ్చేందుకు ఢల్లీిలో సుధీర్గ చర్చలు జరిగాయి, భేషజాలకు పోకుండా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం, వ్యాపారులు కలిసి నడిస్తేనే ప్రగతి సాధ్యం అవుతుంది అన్నారు. పనుల విధానం సరళంగా, సక్రమంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు మనసు కష్ట పెట్టుకోకుండా రేట్ల సవరణ ద్వారా తగ్గిన వస్తువుల ధరల వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలి అని డిప్యూటీ సీఎం కోరారు. జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ తర్వాత, అంతకుముందు వివిధ వస్తువుల ధరలు ఏ విధంగా మార్పు జరిగిందో వ్యాపారులు తమ దుకాణాల ముందు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరంగా ప్రదర్శించాలని డిప్యూటీ సీఎం కోరారు.
జీఎస్టీ రేట్ల సవరణతో వ్యవసాయ రంగానికి అవసరమైన పరికరాల ధరలు, ఆహార ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. సిమెంట్ జీఎస్టీ స్లాబ్ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు, ఫలితంగా సిమెంటు ధరలు తగ్గుతాయి అన్నారు. సిమెంటు ధరలు తగ్గడంతో నిర్మాణరంగం భారీగా పెరుగుదలకు అవకాశాలు ఏర్పడతాయి అని డిప్యూటీ సీఎం వివరించారు. హైదరాబాద్ ఒక నగర రాజ్యాంగ మారుతుంది, రాష్ట్రవ్యాప్తంగా అర్బనైజేషన్ పెరుగుతుంది తద్వారా ఇన్ఫ్రారంగం వ్యాపారాన్ని వ్యవస్థీకృతం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. తగ్గుతున్న సిమెంటు ధరల వివరాలను వ్యాపారులు తమ దుకాణాల ముందు ప్రదర్శించాలని కోరారు. (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్) వాస్తవంగా వ్యాపారం చేసే వారికి ఇది ఉపయోగకరం అడ్డదారులు తొక్కే వారి వల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. నిబద్ధతతో స్వచ్ఛంగా వ్యాపారం చేసేవారు అడ్డదారులు తొక్కే వ్యాపారుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని డిప్యూటీ సీఎం వ్యాపారులను కోరారు.
వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వ ద్వారాలు నిరంతరం తెరిచే ఉంటాయి అని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చే సమస్యలను చర్చించి పరిష్కరించి సులభతరమైన వ్యాపారం చేసుకునే అవకాశాన్ని రాష్ట్రవ్యాప్తంగా కల్పిస్తామని అన్నారు.ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుంది, ప్రజలకు ఆ ఫలాలు చేరాలంటే వ్యాపారులు భాగస్వాములు కావాలని కోరాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ వారి అభిప్రాయంగా తెలియజేయాల్సిందిగా కోరారని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు. బీమా, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన వ్యాపారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.