కరేబియన్‌ దీవులపై విరుచుకు పడ్డ ఇర్మా

బార్బడోస్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): కరీబియన్‌ దీవులను హరికేన్‌ ఇర్మా వణికిస్తున్నది. ఇర్మా వల్ల భారీ స్థాయిలో కరీబియన్‌ దీవులు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో బిల్డింగ్‌లు కూలిపోయాయి. సుమారు పది మంది మరణించినట్లు సమాచారం. బార్బడా దీవి నివాసానికి పనికి రాకుండా పోయింది. సెయింట్‌ మార్టినా కూడా దాదాపు కొట్టుకుపోయినట్లు అధికారులు చెప్పారు. హరికేన్‌ ఇర్మా వల్ల చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇర్మాను అయిదవ క్యాటగిరీ తుఫాన్‌గా ప్రకటించారు. ప్రస్తుతం డామినికన్‌ రిపబ్లిక్‌కు వాయవ్య దిశలో ఇర్మా కొనసాగుతున్నది. ఈ దశాబ్ధంలోనే ఇది అత్యంత శక్తివంతమైన తుఫాన్‌గా అభివర్ణించారు. ఇర్మా వల్ల గంటలకు 285 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇటీవల హరికేన్‌ హార్వే ధాటికి అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.