కరోనాతో ఇప్పుడే జాగ్రత్తలు అవసరం

నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం
యూరప్‌ దేశాల్లో మాదిరి విజృంభించే అవకాశం
న్యూఢిల్లీ,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి) : కరోనా ఇప్పుడు రెండో,మూడోదశకు చేరుకుందన్న వార్తలు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఎలాంటి లక్షణాలు అంటే జలుబు, జ్వరం వంటివి లేకుండానే కరోనా సోకుతోంది. దీంతో పాటు మూడ్రోజుల్లోనే దీని ప్రభావం తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న
హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈమధ్య కరోనా తీవ్రత ఎక్కువగా వున్నట్టు కనబడుతున్న కర్ణాటక, కేరళల్లో కూడా కొత్త కేసులు తగ్గాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా చెప్పినట్టు కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా అప్రమత్తత ఏమాత్రం సడలనీయకూడదు. మాస్క్‌ ధరించడంతో మొదలుపెట్టి ముందు జాగ్రత్తల్లో దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా తీవ్రత తగ్గినట్టు కనిపించడంతో చాలామందిలో ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి బయల్దేరింది. కొందరు శాస్త్రవేత్తలు భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్‌ ఉచ్చస్థితికి వెళ్లి, అక్కడినుంచి వెనక్కి రావడం మొదలైందంటున్నారు. మనకిక రెండో దశ బెడద ఉండకపోవచ్చునని చెబుతున్నారు. ఇదే తీరు కొనసాగితే వచ్చే ఫిబ్రవరినాటికల్లా ఈ మహమ్మారి విరగడకావొచ్చునని అంచనాలు వేస్తున్నారు. కానీ ముందుజాగ్రత్త చర్యల్ని విస్మరించేవారు వైరస్‌ బారిన పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అందువల్లే వ్యాక్సిన్‌ వచ్చేవరకూ ఇప్పుడమలవుతున్న జాగ్రత్తలన్నీ పాటించకతప్పదు.
యూరప్‌ దేశాలన్నీ కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణతో కుదేలవుతున్న వేళ మన దేశంలో తొలిసారి ఆ మహమ్మారి క్రమేపీ ఉపశమిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి. కరోనాపై మనం పోరు ప్రారంభించి దాదాపు ఏడు నెలలు కావస్తుండగా జూలై నుంచి అది విస్తరిస్తూ పోయింది. నియంత్రణ విధానాలను విస్మరిస్తే ఏమవుతుందో ప్రస్తుతం యూరప్‌ దేశాలనూ, అమెరికానూ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా యూరప్‌ దేశాలన్నీ ఇంచుమించుగా కరోనా బారినుంచి బయటపడి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడం మొదలుపెట్టాయి. పరిమితంగా అయినా పరిశ్రమలు తెరుచుకోవడం, రవాణా సదుపాయాలు సాధారణ స్థితికి చేరడం, మళ్లీ జనం రోడ్లపై సందడి చేయడం కనబడింది. వృధా ప్రయాణాలు మానుకోవాలని, సాధ్యమైనంతవరకూ ఇళ్లకే పరిమితం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.  కలిసికట్టుగా నిబంధనలు పాటించడం వల్లే వైరస్‌ తొలి దశ దాడినుంచి కనిష్ట నష్టాలతో బయట పడగలిగామని, ఇప్పుడు సైతం దాన్ని మరిచిపోవద్దని విజ్ఞప్తిచేశారు. యూరప్‌ దేశాల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా వుంది. కరోనా తొలి దశ విజృంభణ నుంచి బయట పడ్డాక నెమ్మదిగా యధాపూర్వ స్థితికి వస్తున్న తరుణంలో రెండో దశ విజృంభణ పుట్టుకొచ్చి అంతంతమాత్రంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థల్ని చిక్కుల్లో పడేసింది. జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌లు గతవారం మళ్లీ కఠినమైన ఆంక్షల్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. ఇవి ఇంకా పెరుగుతాయని రెండు మూడు రోజులుగా నాయకులు చెబుతున్నారు. కరోనా బయటపడిన తొలి నాళ్లలో కేరళ దాన్ని సమర్థవంతంగానే ఎదుర్కొంది. వరసబెట్టి తీసుకున్న చర్యల కారణంగా అక్కడ కేసుల సంఖ్య రోజుకు కేవలం రెండు, మూడు మాత్రమే వెల్లడైన సందర్భాలున్నాయి. కానీ ఈమధ్య అవి మళ్లీ పెరుగుతున్నాయి. దీని వెనకున్న కారణాలేమిటో నిపుణులు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలయ్యాక జనాన్ని హెచ్చరించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్ల వరసగా వచ్చిన పండగల్లో జాగ్రత్తలు తీసుకోవడం తగ్గిందని, అందుకే కేసులు పెరిగాయని అంటున్నారు. రవాణా సదు పాయాలను కొనసాగిస్తూనే, ఇతరత్రా కార్యకలాపాలకు చోటిస్తూనే నిరంతరం అందరూ అప్రమ త్తంగా వుండకతప్పదు. ఎక్కడ లోపం జరిగినా పరిస్థితి మొదటికొచ్చే ప్రమాదం వుంటుంది.