కరోనాపై సమర్ధవంతంగా పోరాడాలి

దిల్లీ,మార్చి 21(జనంసాక్షి): నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు యువ రాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ పోరాడిన రీతిలో కరోనా వైరస్ పై యావత్ భారత్ పోరాడాలని కోరారుప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం కోసం ఆదివారం జనతా కర్ఫ్యూ విధించిన సం గతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్చం దంగా జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ కోరారు. దీన్ని స్వాగతిస్తూ భారత క్రికెటర్లు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటించాలని మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ కూడా ట్వీట్లు చేశారు. దీనికి మోదీ స్పందించారు. “ఇక్కడ ఇద్దరు (కైఫ్, యువరాజ్) అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. వారి భాగస్వా మ్యం మనం ఎప్పటికీ మరవలేనిది. వారు చెప్పినట్లుగా ఇప్పుడు మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది. అయితే, ఈ సారి కరోనాపై చేసే పోరాటంలో యావత్ భారత్ మొత్తం భాగస్వామ్యం అవ్వాలి” అని మోదీ ట్వీట్ చేశారు.