కరోనా బాధితురాలికి వాచ్మెన్ వేధింపులు
ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముంబై,నవంబర్7(జనంసాక్షి): ముంబైలో ఓ ఆస్పత్రి వాచ్మాన్ దారుణానికి ఒడిగట్టాడు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని మలద్ ఏరియాలోగల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వాచ్మాన్ పనిచేస్తున్న వ్యక్తి ఆ ఆస్పత్రి కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితురాలిని లైంగికంగా వేధించాడు. మహిళ తన గదిలో ఒంటరిగా ఉన్న సమయం చూసి అందులో చొరబడిన వాచ్మన్ ఆమెపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫోన్చేసి జరిగిన విషయం చెప్పింది. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మహిళ నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.