కవ్వాల్‌ ప్రాంత అడవుల్లోకి వెళ్లొద్దు

అటవీ అధికారుల సూచనలు పాటించాలి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో అనుమతి లేకుండా అడవిలోకి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసారు. పులుల సంరక్షణలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు స్థానికులు సహకరించాలని కోరారు. తప్పనిసరి పరిస్థితిలో అడవికి వెళ్లాల్సి వస్తే అటవీశాఖ అధికారుల అనుమతి పొందాలన్నారు. ఇటీవల పెద్దపులి సంచారం చేస్తోందన్న వార్తల నేపథ్యంలో అడవుల్లోకి వెళ్లాలనుకుంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. ఎలాంటి అనుమతి లేకుండా అడవిలోకి వెళ్లవద్దని రేంజ్‌ అటవీ అధికారులు హెచ్చరించారు. మల్యాల్‌,మహ్మదాబాద్‌, రోటిగూడ, సింగరాయిపేట, అల్లీనగర్‌, దొంగపల్లి, మాకులపేట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో పక్క మేత కోసం అడవికి వెళ్లే తమ పశువులు ఇంటికి వచ్చేవరకు నమ్మకం లేదని ప్రజలు వాపోతున్నారు. కవ్వాల్‌ అభయారణ్యాన్ని టైగర్‌ రిజర్వ్‌గా గుర్తించడంతో ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అంతా భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడి గ్రామాల పశువులు మేత కోసం అటవీ ప్రాంతంలోకి వెళుతున్నాయి.